ఏపీ అంతటా మద్యం అమ్మకాలు.. ఆ ఒక్క జిల్లాలో తప్ప..!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఆ ఒక్క జిల్లాలో మాత్రం బ్రేక్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మద్యం షాపులు తెరవలేమని ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ అండ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు స్పష్టం చేశారు. వైన్‌ షాపులకు స్టాక్ తరలించే మద్యం డిపోలు జిల్లాలో ఒంగోలులో ఒకటి, మార్కాపురంలో ఒకటి ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్నాయి. దీంతో మద్యం డిపోల వద్దకు పెద్దఎత్తున సరుకు తరలింపునకు వాహనాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున కలెక్టర్‌ పోల భాస్కర్‌ ఈ వ్యవహారంలో పోలీసు, ఎక్సైజ్‌ అధికారులతో పలు మార్లు ఇప్పటికే చర్చించారు.


ఒంగోలు ఎక్సైజ్‌ డిపో ఉన్న పేర్నమిట్ట, మార్కాపురం ఎక్సైజ్‌ డిపో ఉన్న ప్రాంతంలో ఒకటి రెండు రోజులపాటు ఎలాంటి కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూడకపోతే వాటిని కంటైన్‌మెంట్‌ జోన్‌ల పరిధి నుంచి తప్పించేందుకు అవకాశం ఉంది. మంగళవారం కూడా దీనిపై నిర్ణయం వెలువడకపోవడంతో బుధవారం షాపులను తెరవలేమని, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడితే గురువారం లేదా శుక్రవారం నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.